15, ఏప్రిల్ 2014, మంగళవారం

సామాన్యుని కవితా స్పందన ‘రెండు జ్ఞాపకాలు’
సూరారం శంకర్
సెల్.నం.9948963141
వెల : 200/-

‘హామీ ఇస్తున్నాను
రైతుల్ని ఏమరచిన రాజ్యాలు మిగలవని
వృత్తుల్ని నిరాకరించిన సమాజాలు మిగలవని
కవుల్ని భంగపరిచిన రాజులు మిగలరని’
ఇలా ఆశావహమయిన ఎన్నో కవితల సమాహారం రెండు జ్ఞాపకాలు. కవి సూరారం శంకర్‌కి ఎన్నో కలలున్నాయి. మాన్యునివైపు నిలబడి నినదించే భావోద్రేకముంది. ఉత్తర తెలంగాణ జిల్లాల నుండి ఎదిగి వచ్చిన కవి గనుక కవిత్వంలో ఆవేశమూ ఆలోచనా ఒకింత కవిత్వ గుబాళింపూ ఉన్నాయి. మంచి చిత్రకారుడు గనుక బొమ్మలు వేయడంతో పాటు తన కవితల్ని చిత్రిక పట్టిన తీరు కూడా రేఖాచిత్రాన్ని వీక్షించినట్టే ఉంటుంది.
‘నువ్వెందుకూ పనికి రావని
విసిరేసిన రెండు జ్ఞాపకాలిప్పుడు
నా తోటలో రెండు గులాబీ నక్షత్రాలై
విచ్చుకున్నాయి’ ఈ పాదాల్లో కనిపించే కవితా భావుకత పాఠకుల్ని కట్టిపడేస్తుంది. ఇక జీవితం మీద కూడా సూరారం శంకర్‌కి స్పష్టత ఉంది. వర్తమాన సమాజంలో ప్రపంచీకరణ ప్రభావాలపైన కూడా శంకర్‌కి స్పష్టత ఉంది. అంతకుమించిన వ్యతిరేకత ఉంది. అంతకుమించి సెజ్‌లపైనా వ్యతిరేకతా వాటి పర్యావసనాలపైన స్పష్టతా ఉన్నాయి. సెజ్‌లపైన మూడు కవితలు రాశారు శంకర్.
పాపుల హస్తాలు చాలా పొడవు
పాలకుల హస్తాలు ఇంకా పొడవు అంటాడు
లోమల్ని గుట్టల్ని గుహల్ని
రాళ్లని రప్పల్ని
పేటెంట్‌కి గురి చేస్తున్న వాళ్లని ఏమనగలం
అంటూ దుఃఖాన్ని ప్రకటించిన కవి
‘చెమటని కాదు రక్తాన్ని కాదు
ఆత్మలు విత్తిన నేల
సెజ్‌ల దురాక్రమణకి తల్లడిల్లుమంది’ అంటూ ఆవేదన చెందుతాడు. ఆవేదనతో సరిపుచ్చకుండా ‘పారా హుషార్.. ఇప్పటికిది రైతు వీరుడి ధర్మాగ్రహం మాత్రమే. ఔను ధర్మాగ్రహం మాత్రమే’ అంటూ కాకినాడ సెజ్‌ల ఉదంతాన్ని కవిత్వం చేశాడు. ఇక కవులు కత్తులు పూయరు/శరత్తులు పూస్తారు/కవులు కబుర్లు చెప్పరు/ మనుష్యుల్ని మహాత్ముల్ని చేస్తారు అంటూ కవుల పాత్ర గురించి రాస్తాడు. వృద్ధాప్యం శాపం కాదు/ బ్రతుకు చావిడిలో అదొక ఇంద్రతాపం అన్న సూరారం శంకర్ అనుకుంటాం కాని మెట్టు కూలిపోతున్నప్పుడు/తనని తాను నిలబెట్టుకోవడమూ కష్టమేనంటాడు. కాలాలు ప్రజల కలలకు కాపలా దార్లు/ ప్రజాకంటకుల పాలనకు ఉరిత్రాళ్లు అన్న శంకర్ కొందరు కవులు ప్రవర్తించే తీరునీ నిరసించాడు. బ్లాక్‌పోయెట్రీ అంటూ దొడ్డిదారిన వెళితే/ అన్ని అవార్డులూ మనవే/ అన్ని సత్కారాలూ మనవే/ రాండీ కవిత్వం అచ్చోసుకుందాంరాండి అని పిలుపునిచ్చాడు. ఇలా రెండు జ్ఞాపకాలు కవిత్వం నిండా సామాజికతకు, సామాన్యునికి పెద్దపీట వేశారు. కాని అక్కడక్కడా నిరాశ కూడా ద్యోతకమవుతుంది.
తెలుస్తూ తెలుస్తూ
ఆరిన దీపాన్ని నేను
ఇపుడు ఎవరికీ ఏమీ కాను - అని తాత్త్వికంలో బాధపడతాడు. కవి ఆశావహమయినపుడు నిరాశని దరిచేయకూడదు. అంతేకాకుండా సూరారం అనేక ప్రక్రియలు (కవిత్వం, చిత్రలేఖనం, గజళ్లు) చేపట్టడం వల్ల ప్రతిభగలిగిన వారే అయినప్పటికీ ఆయన శక్తి వివిధ ప్రక్రియల్లోకి విభజింపబడుతోంది. కవిత్వానే్న మరింత సీరియస్‌గా స్వీకరిస్తే సూరారం శంకర్ మరింత మంచి కవిత్వాన్ని వెలువరించగలరు.
‘ఈ దేశంలో ఒక రోజు
సామాన్యుడు జెండా ఎగురవేస్తాడు
రాజులు సాల్యూట్ చేస్తారు’ అని స్పష్టమయిన అవగాహన, ఆశ ఉన్న కవి సూరారం శంకర్ వెలువరించిన రెండు జ్ఞాపకాలు చదవదగ్గ కవిత్వం.
భిన్న పార్శ్వాల్ని స్పృశించిన ‘విభిన్న కోణాలు’

పంజాల జగన్నాథం
సెల్.నం.9948531985
యాభైకి పైగా కథలు రాసి పలు కథా సంపుటాలు వెలువరించిన పంజాల జగన్నాథం సమాజం గురించి, సామాజిక సాహిత్య ప్రభావాల గురించి అనేక అంశాల్ని విశే్లషిస్తూ రాసిన వ్యాస సంపుటి విభిన్న కోణాలు. సామాజిక అవగాహన, మంచితనం పట్ల విలువల పట్ల నిబద్ధతగల రచయితగా పేరు గడించిన పంజాల జగన్నాథం కథల్లో కాకుండా ఇతరత్రా తాను చెప్పదల్చుకున్న అంశాల్ని చక్కని వ్యాసరూపాల్లో రాశారు. వివిధ పత్రికల్లో ప్రచురితమయిన వ్యాసాల్ని క్రోడీకరించి విభిన్న కోణాలుగా పాఠకుల ముందుకు తెచ్చారు. సులభంగానూ సరళంగానూ సాగిపోయే వచనంతో ఈ వ్యాసాలు చక చకా చదివిస్తాయి.
25 వ్యాసాలతో కూడిన సంకలనం నిండా రచయితకున్న సామాజిక నిబద్ధత కనిపిస్తుంది. కొన్ని సాహిత్య అంశాలపైన రాసిన వ్యాసాలున్నాయి. కథ అంటే. అన్న వ్యాసంతో కథ సామాజిక సమస్యల్ని వ్యక్తీకరించడంతో చక్కని పాత్ర పోషిస్తుంది అంటాడు. కథా రచయితలు తీసుకోవాల్సిన దృష్టి కోణాన్ని, కథన రీతిని తనదైన అనుభవంతో వివరించారు. అలాగే కథలు ఎలా పుడతాయి అన్న వ్యాసంతో కథలకు ప్రేరణగా ఉండే అంశాల్ని క్రోడీకరించి చెప్పారు. ఇంకా కలాలకు సంకెళ్లు వ్యాసంలో రచయితలు జర్నలిస్టులపై ఉండే నిర్బంధాల గురించి రచయితలారా ఆలోచించండి అన్న వ్యాసంలో రచయితల్లో ఇగోయిజం ఉండకూడదని ఉండకూడదని చెబుతూ తన అనుభవాల్ని ఊటంకిస్తాడు. ఇక ప్రస్థుతం సర్వత్రా వినిపిస్తున్న సెజ్‌ల గురించి పంజాల జగన్నాథం మంచి వ్యాసం రాశాడు. కొలువుదీరుతున్న కృత్రిమ సెజ్ ప్రగతి అన్న ఈ వ్యాసంలో సెజ్‌ల వివరాలు సవివరంగా రాశారు. అంతే కాదు సెజ్‌ని కథాంశంగా తీసుకుని తుమ్మేటి రఘోత్తమ రెడ్డి అశువుగా చెప్పిన సెజ్ కథను తనదైన రీతిలో విశే్లషించి రాశారు జగన్నాథం ఈ సంపుటిని.
ఇక మన చుట్టూ జరుగుతున్న అనేక సంఘటనల్ని, సందర్భాల్ని విశే్లషిస్తూ తన అభిప్రాయాల్ని జోడిస్తూ పంజాల జగన్నాథం మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు అంతమెక్కడ, వృద్ధాప్యం, భ్రూణ హత్యలు, వలసలు, ఆకర్శణ మోజులో ప్రేమ సమాధి, కుల శక్తుల విస్తరణ కుల చాందసవాదం మొదలైన అనేక వ్యాసాలు రాశారు. ఫిక్షన్ రచయిత అయిన పంజాల జగన్నాథం కథా చట్రంలో ఇమడ్చలేని తన అభిప్రాయాల్ని జరుగుతున్న సంఘటనల్ని మంచి సరళమయిన వ్యాసాలుగా వెలువరించారు. సమకాలీనతను, సంస్కృతిని ప్రతిబింభించిన ఈ వ్యాసాలు యువతకు మంచి ఉపయుక్తంగా ఉన్నాయి. భవిష్యత్తులో మరిన్ని వౌళిక వ్యాసాలు తాత్విక ప్రతిపాదనలతో రాస్తారని వెలువరించాలని పంజాల జగన్నాథం గారినుంచి ఆశించవచ్చు.
మనిషి తనాన్ని వీచిన ‘ఇక్కడి చెట్ల గాలి’
===========================
నందిని సిధారెడ్డి
వెల : 50/-
సెల్: 9440381148


కూలుతున్న మనిషి
కుములుతున్న మనిషి
ఒకటేనా?
విక్రయశాలల నడుమ
వింత కూడలి నడుమ
వెలుగుతున్నది మనసేనా..

మనిషిని మనిషి తనాన్ని, మనసుని, మనసు పడే వేదనని వర్తమాన సమాజంలో అతలాకుతలమవుతున్న మానవ సంబంధాల్ని కవితాత్మకంగా సరళంగా ఆవిష్కరించిన కవితాసంపుటి ‘ఇక్కడి చెట్ల గాలి’. నందిని సిధారెడ్డి కవిత్వం నిండా అద్భుతమైన ఊహ, సరళత్వమూ, పల్లె జీవితపు పరిమళాలూ కనిపిస్తాయి. సీనియర్ కవి మంచి వక్తకూడా అయిన సిధారెడ్డి కవిత్వంలో మనిషిలో పరి ఆత్మీయత దగ్గరితనం నిండా పరుచుకుని ఉంటుంది. మనిషికీ మనిషికీ నడుమ/మనిషికీ భూమికీ నడుమ/్భమికీ భూమికీ నడుమ/ అసహజమైన ఈ ఫెన్సింగ్ ఏమిటి/ అని పలవరించే సిధారెడ్డి, ఈ లోపల/ గాలి రెక్కలమీద/ మనిషిని చేరుకోవాలె/ ఎవరికీ తలవంచని రేషం అద్ది/ పద్యం ఎగురవేయాలె అంటాడు. మనుషుల్ని, మమతల్ని, మనుషులున్న ప్రపంచాన్ని ప్రేమించిన కవి సిధారెడ్డి. అంతేకాదు ఆయన ఊరునీ ఊరి అనుబంధాల్ని ప్రేమించాడు. ఒకలకొకలు సాంత్వనగా నిలిచే ఊరు కావాలనుకున్నాడు. ఊరేనయం/ ఊరడిస్తది/ చదువుకోకపోయినా/ సముజాయిస్తది - అని ఊరి మమతల్ని కవిత్వం చేశాడు. ఊరునే కాదు చెరువునీ ప్రేమించాడు. చెరువొడ్డునీ కవిత్వం చేశాడు. తొలికరణం/ చెరువును రంగరించి/ ఒడ్డుని పుదిస్తలి. ఆ కడ/ కండ్లు నలుముకుంటూ/ జీవితం జిగేల్ మంటది అంటాడు. ఆ ఒడ్డు/ పొద్దున సందడి/ రాత్రి ఒంటరి అని స్పందిస్తాడు. ఆత్మ ఎగిరిపోయిన ఇంటి గురించి ఆవేదనతో ఇంటి శోకం కవిత చెప్పాడు సిధారెడ్డి. ఇంటికి ఎన్ని చేసినా ఎంత అలంకరించినా ఎందరున్నా ఆత్మ ఎగిరిపోయిన ఇల్లు/ చిన్నబోకేం చేస్తది అంటూ ఇంటిని. ఇంటెనుక కాకులు లేవు/ కొట్టంల ఎడ్లు లేవు/ పెరట్ల మంచె లేదు/ ఇల్లు చిన్నబోదా/ కట్టిన మనిషి లేక/ కనిపెట్టే బంధం లేక మనమనుకునే మనుషుల సందడి లేక / ఇల్లు చిన్న బోయింది అంటాడు. ఇక ఎవరయినా చనిపోయినప్పుడు ‘పిట్టకు పెట్టే’ కార్యక్రమాన్ని హృద్యం గా కవిత్వం చేశాడు. పొద్దుకు తొందరెక్కువ/ పొయ్యిదిగకముందే ఉరుకొస్తది అని మొదలయిన కవిత సూర్యుడు నెత్తిమీదికి చేరినా/ చుట్టాలు చెట్టు కిందికి చేరినా/ సుతులు ఆందోళనపడ్డా ఒక్క పిట్టరాదు/ పిట్ట ముట్టలేదు/ రావటానికైనా ముట్టడానికైనా పిట్టలుంటే గదా అంటాడు. ఆవేదనలోంచి పర్యావరణ ప్రమాదాల్ని చెబుతాడు. సున్నితమయిన భాషలో సంద్రమయిన కవిత్వం చెప్పే సిద్ధారెడ్డి రంగుల జీవి గురించి రాసినా, ఒంటరి దిగులు గురించి రాసినా, బంగారం పిచ్చి దంతేరస్ గురించి చెప్పినా నిండా కవిత్వం పంచుతాడు. రమణీయంగా/ రాజకీయంగా/ రాజ్యం వణికేరాగం పాడాలె అంటూ ప్రాణగానం చేసే సిధారెడ్డి జీవన సారాంశాన్ని జీవరేఖ పేర్ల ఆవిష్కరించాడు. జ్ఞాపకం కొంత/ మరుపు కొంత/ బతుకుకు రెండంచులు/ ఒక మొదలు ఒక చివర/ రెండు కొసలు కలిపేదే రేఖ’. ఆయన కవిత్వం నిండా జీవితమూ అనుభవాలూ అల్లుకుని వున్నాయి. చిక్కని కవితకి చక్కని దాఖలా ఇది.